పెన్షన్‌ డబ్బులతో వందలాది కోతుల ఆకలి తీరుస్తున్న 76 ఏళ్ల మాజీ పోలీస్ అధికారిణి

  • మదురైకి చెందిన 76 ఏళ్ల రిటైర్డ్ పోలీస్ అధికారిణి మాలతి
  • పదేళ్లుగా వందలాది కోతుల ఆకలి తీరుస్తున్న వైనం
  • తిరుప్పరంకుండ్రం పరిసరాల్లోని ఆలయాలు, కొండ ప్రాంతాల్లో ఆహారం
  • తన పెన్షన్‌లో అధిక భాగాన్ని మూగజీవాల కోసమే ఖర్చు
తమిళనాడుకు చెందిన 76 ఏళ్ల విశ్రాంత పోలీస్ అధికారిణి తన సేవా దృక్పథంతో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. గత దశాబ్ద కాలంగా తన పింఛనులో మెజారిటీ వాటాను వెచ్చిస్తూ వందలాది కోతుల ఆకలి తీరుస్తూ ఆమె ఆదర్శంగా నిలుస్తున్నారు. వయసు రీత్యా కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నప్పటికీ, తన కార్యక్రమానికి ఆమె ఏనాడూ విఘాతం కలిగించలేదు.

మదురైకి చెందిన మాలతి, తమిళనాడు పోలీస్ శాఖలో 33 ఏళ్ల పాటు సుదీర్ఘ కాలం సేవలు అందించి 2010లో పదవీ విరమణ చేశారు. అంతకుముందు ఆమె గాంధీగ్రామ్ యూనివర్సిటీతో పాటు కొడైకెనాల్‌లోని ఓ అంతర్జాతీయ పాఠశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. 2015 నుంచి తిరుప్పరంకుండ్రం మురుగన్ ఆలయం, శరవణ పొయిగై, మయిల్ తొప్పు సహా ఆరు వేర్వేరు ప్రాంతాల్లోని కోతులకు ఆమె క్రమం తప్పకుండా ఆహారాన్ని అందిస్తున్నారు.

ప్రతి శనివారం మధ్యాహ్నం ఆమె ఇచ్చే ఆహారం కోసం సుమారు 350 నుంచి 400 కోతులు ఆతృతగా ఎదురుచూస్తుంటాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, "కొండ ప్రాంతాల్లో ఆహారం లభించక ఇబ్బంది పడుతున్న కోతులను చూసి చలించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను. ఈ మూగజీవాలకు సేవ చేయడం నాకు ఎంతో ఆనందాన్ని, మానసిక సంతృప్తిని ఇస్తోంది. నాలో సత్తువ ఉన్నంత కాలం ఈ సేవను నిరంతరాయంగా కొనసాగిస్తాను" అని మాలతి పేర్కొన్నారు.

మాలతి కోతులకు ఆహారం అందిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పదవీ విరమణానంతరం విశ్రాంతికే పరిమితం కాకుండా, మూగజీవాల పట్ల మమకారం చాటుతున్న ఆమెపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Malathi
Retired Police Officer
Feeding Monkeys
Tamil Nadu
Madurai Tirupparankundram
Animal Welfare India

More Telugu News